🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 18 June 2026, 06:13 PM Posted by: MANA VISHWAM

మెట్ టెండర్లలో ‘గోల్‌మాల్’ లేదు.. అంతా పారదర్శకమే: హైడ్రా క్లారిటీ!

తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు!

​నిబంధనల మేరకే ఎంపిక.. సడలింపులపై స్పష్టత

​బ్లాక్ లిస్ట్ భయంతోనే బురదజల్లే ప్రయత్నం?


రాబోయే వర్షాకాలంలో నగర ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు చేపట్టిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్’ (MET) టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని హైడ్రా (HYDRAA) స్పష్టం చేసింది. టెండర్ల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని, కొందరు కావాలనే సాంకేతిక అంశాలను భూతద్దంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడింది.

​తొమ్మిది మంది ఇంజినీర్ల కమిటీతోనే స్క్రీనింగ్!

జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు చెందిన తొమ్మిది మంది అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో కూడిన ప్రత్యేక కమిటీ ప్రతి టెండరును క్షుణ్ణంగా పరిశీలించిందని హైడ్రా వెల్లడించింది. అధికారులు అన్ని రకాల రూల్స్ క్రాస్ చెక్ చేసిన తర్వాతే టెండర్లను ఫైనల్ చేశారని, ఇందులో ఎలాంటి గోల్‌మాల్‌కు తావులేదని స్పష్టం చేసింది.

​నిబంధనల సడలింపుపై అసలు నిజం ఇదీ..

మెట్ వాహనాలకు సంబంధించి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (PUC), ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ పత్రాల సమర్పణ గడువులో మాత్రమే క్షేత్రస్థాయి అవసరాల కోసం కొంత సడలింపు ఇచ్చామని హైడ్రా ఒప్పుకుంది. అయితే, కాంట్రాక్టర్ల గత అనుభవం, ఆర్థిక సామర్థ్యం, సొంత లేదా లీజు వాహనాల లాంటి కీలక నిబంధనల్లో ఎక్కడా రాజీ పడలేదని వివరించింది.

​కాంట్రాక్టర్ శ్రీశైలం ఎలిగేషన్‌పై స్పష్టత

టెండర్లు దక్కని కొందరు కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగానే హైడ్రాపై, ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించింది. ముఖ్యంగా కాంట్రాక్టర్ పట్నం శ్రీశైలం గత ఏడాది సొంత వాహనాలు ఇస్తామని చెప్పి అద్దె వాహనాలతో మేనేజ్ చేశారని.. ఈ ఏడాది 30 టెండర్లకు అప్లై చేసినా సరైన డాక్యుమెంట్లు పెట్టకపోవడం వల్లే కమిటీ ఆయనను రిజెక్ట్ చేసిందని వెల్లడించింది. అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది.
🏠 Home