🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 23 June 2026, 07:56 AM Posted by: MANA VISHWAM

​బాసరలో కలకలం: జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో భారీ చోరీ!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పరిసరాల్లో భారీ చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ప్రధాన ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దుండగులు టార్గెట్ చేశారు. ఆలయ గేటు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. అమ్మవారి వెండి కిరీటంతో పాటు, అక్కడ ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు.

​వ్యాసగుడి వద్ద హుండీ కలకలం

దొంగలు హుండీలోని నగదు మొత్తాన్ని కాజేసి, ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున నిత్య పూజల కోసం ఆలయానికి వచ్చిన అర్చకులు, గేట్లు పగిలి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ మాయమైనట్లు గుర్తించి వెంటనే ఆలయ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.


​రంగంలోకి దిగిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ముక్కోటి దేవతల నిలయమైన బాసర క్షేత్రంలో, అదీ కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆలయ ప్రాంగణంలోనే ఈ చోరీ జరగడం స్థానికంగా మరియు భక్తులలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
🏠 Home