🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 25 June 2026, 07:26 AM Posted by: MANA VISHWAM

డీటీవో వెంకన్న మృతిపై అధికారుల సమగ్ర విచారణ

ఘటనాస్థలిలో ప్రత్యక్ష పరిశీలన.. సీసీటీవీ ఫుటేజీ, లారీ రికార్డుల పరిశీలన

ఒకటి, రెండు రోజుల్లో రవాణా కమిషనర్‌కు ప్రాథమిక నివేదిక

భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (డీటీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటనపై రవాణా శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లిలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో బొగ్గు లారీ ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించేందుకు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం భూపాలపల్లిలో విచారణ నిర్వహించారు.
ముందుగా గణపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, ప్రమాద ఘటనపై పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను సీఐ కరుణాకర్‌రావు, ఎస్‌ఐ అశోక్‌ల నుంచి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి సంబంధించిన లారీ డ్రైవర్, వాహన యజమాని, హార్వెస్టర్ డ్రైవర్‌లను విడివిడిగా విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.
తర్వాత జెన్‌కో అధికారులతో సమావేశమైన జాయింట్ కమిషనర్, ప్రమాదం జరిగిన రోజున లారీలో తరలించిన బొగ్గు పరిమాణం, రవాణా ప్రక్రియకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అక్కడ ఉన్న నలుగురు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ గనికి వెళ్లిన అధికారులు, అక్కడి ప్రతినిధులతో సమావేశమై ప్రమాదం జరిగిన రోజున సంబంధిత లారీకి సంబంధించిన లోడింగ్ రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని, ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రాథమిక నివేదికను రవాణా కమిషనర్‌కు సమర్పించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విచారణలో ఎంవీఐ లు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్‌తో పాటు ఏఎంవీఐ లు వాహన తనిఖీ ఫాహిమా సుల్తానా, సుందర్‌లాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
🏠 Home