🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 25 June 2026, 11:04 PM Posted by: MANA VISHWAM

అంగన్‌వాడీ నియామకాల జీఓపై సత్యవతి రాథోడ్ ఫైర్

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అవినీతికి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియామకాల కోసం తీసుకొచ్చిన కొత్త జీఓను ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
నియామక ప్రక్రియలో కలెక్టర్లకు 10 మార్కులు కేటాయించే విధానం పారదర్శకతను దెబ్బతీసే అవకాశముందని ఆమె అన్నారు. ఈ విధానం వల్ల రాజకీయ జోక్యం, సిఫారసులు పెరిగే ప్రమాదం ఉందని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రుల ప్రభావంతో అర్హులైన అభ్యర్థులు అన్యాయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కేటాయించామని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో పారదర్శకతకు భంగం కలిగే అంశాలు ఉన్నందున వాటిని వెంటనే సవరించి న్యాయమైన నియామక ప్రక్రియను అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
🏠 Home