🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 26 June 2026, 10:22 PM Posted by: MANA VISHWAM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: విజయశాంతి

హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలి

ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలకు డిమాండ్

ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి కోరారు. న్యాయస్థానం సూచనలను అమలు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారి విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజయశాంతి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యాసంస్థల వ్యవహారశైలిపైనా విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులకు తగిన నాణ్యమైన విద్య, అవసరమైన సౌకర్యాలు అందించడం ఆయా విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు.
గతంలో విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికలను ఆధారంగా తీసుకుని, కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.
🏠 Home