🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 29 June 2026, 02:17 PM Posted by: MANA VISHWAM

కానిస్టేబుల్ యాకూబ్‌పై కేసు నమోదు.. కోర్టు ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.డి. యాకూబ్‌పై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. తనను తీవ్రంగా దూషిస్తూ, మానసికంగా వేధింపులకు గురిచేశారని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ స్టాలిన్ బేగ్ ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బాధితుడి వాదన ప్రకారం, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆయన ప్రథమ శ్రేణి న్యాయ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించింది.
ఈ వ్యవహారంపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ప్రకారం సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ముల్కనూర్ ఎస్‌హెచ్‌వోకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీసులు కానిస్టేబుల్ ఎం.డి. యాకూబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు నిర్వహించే పోలీసు సిబ్బందిపైనే కోర్టు ఆదేశాలతో కేసు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🏠 Home