🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 30 June 2026, 10:41 PM Posted by: MANA VISHWAM

యాదాద్రి దేవస్థానానికి కొత్త పాలకమండలి.. బోర్డు సభ్యురాలిగా కొణిదెల సురేఖ

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలక మండలిని నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం నిబంధనల మేరకు కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన పాలక మండలికి ఎం.సత్యనారాయణ రెడ్డి ని ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్‌తో పాటు నామినేటెడ్ సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 18 మందితో ఈ బోర్డు ఏర్పాటైంది.
నామినేటెడ్ సభ్యులుగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలపగారి విజయరాజం, విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ (ఫౌండర్ ట్రస్టీ)లను ప్రభుత్వం ఎంపిక చేసింది.
అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌ ఛైర్మన్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో), సీనియర్ ప్రధాన అర్చకులు ఎక్స్-అఫీషియో సభ్యులుగా పాలక మండలిలో కొనసాగనున్నారు.
ఈ నియామకాల్లో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా చోటు కల్పించడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె నియామకం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నూతన పాలక మండలి ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

🏠 Home