🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 03 July 2026, 12:19 PM Posted by: MANA VISHWAM

'కుడా' సవాల్ రచ్చ.. మర్రి యాదవరెడ్డి అరెస్ట్! భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత

వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదం.. సవాళ్లు, ప్రతిసవాళ్లు దాటి పోలీసుల అరెస్టుల వరకు దారితీసింది.

​వివాదం నేపథ్యం: రూ. 50 కోట్ల కుంభకోణం ఆరోపణలు

'కుడా'​ప్రభుత్వ భూముల వేలంలో సుమారు రూ. 50 కోట్ల మేర కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతి ఆరోపణలపై తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు, భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని ఆయన బీఆర్ఎస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు.

​సవాల్ స్వీకరణ.. తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధం

​ప్రస్తుత చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి విసిరిన సవాల్‌ను మాజీ కుడా చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మర్రి యాదవరెడ్డి స్వీకరించారు. అన్నట్లుగానే ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భద్రకాళి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు ఆయన బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ రాజకీయాల్లో వేడి రాజుకుంది.

​రంగంలోకి దిగిన పోలీసులు.. అరెస్టులతో ఉద్రిక్తత

​కుడా ప్రస్తుత, మాజీ చైర్మన్ల సవాళ్ల నేపథ్యంలో భద్రకాళి ఆలయం వద్ద ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని, ఇతర బీఆర్ఎస్ నాయకులను ఆలయానికి చేరుకోకముందే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

​ఉద్రిక్త వాతావరణం

పోలీసులు యాదవరెడ్డిని అరెస్ట్ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర నెట్టులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ చేసిన నాయకులను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
🏠 Home