🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 03 July 2026, 10:57 PM Posted by: MANA VISHWAM

50 మంది యువతుల చదువు బాధ్యత తీసుకున్న కేటీఆర్‌ది

ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతుల ఉన్నత చదువులు, వారి సాధికారత బాధ్యతను వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘ఎస్‌పార్సా–2026’ వార్షిక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి బాధ్యతాయుత పౌరుడి కర్తవ్యమన్నారు. విద్య ద్వారానే మహిళల జీవితాల్లో శాశ్వత మార్పును, ఆర్థిక సామాజిక సాధికారతను తీసుకురావచ్చని ఆకాంక్షించారు. ‘టచ్ ఏ లైఫ్’ అనే ఉన్నతమైన భావనతో పనిచేస్తున్న ఎస్‌పార్సా సంస్థ సేవలను ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. మహిళల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ సంస్థ వేలాది కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చిందని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి అక్కినేని అమల గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన మార్గమని, ఎస్‌పార్సా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో మరికొంత మంది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో సంస్థ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home