🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 04 July 2026, 02:14 PM Posted by: MANA VISHWAM

మిడ్జిల్ టూ సీఎం.. రేవంత్‌ రెడ్డి ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు ​ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం, మంత్రుల ఘన సత్కారం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో సరికొత్త మైలురాయిని దాటారు. మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. నేటితో విజయవంతంగా 20 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్నారు. ఒక సామాన్య స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమంటూ పలువురు మంత్రులు ప్రశంసలు కురిపించారు.
​ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

​జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా..

​రాజకీయాల్లో అట్టడుగు స్థాయి నుంచి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రేవంత్‌ రెడ్డి ఈ స్థాయికి చేరారని మంత్రులు కొనియాడారు. సీఎంకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
​తమ అభినందనలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు.
🏠 Home