🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 July 2026, 04:18 PM Posted by: MANA VISHWAM

వాయుగుండంగా మారిన అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు!

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. బాలాసోర్ సమీపంలోని చాంద్‌బలి–దిఘా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపుగా ఇది పయనించనుంది.

​తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి

​ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది.
రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడేలా ఉన్నాయి.

​తీరం దాటే సమయంలో ఈదురుగాలులు

​సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50నుంచి 60కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని ఆదేశించారు.

​ఒడిశాకు రెడ్ అలర్ట్.. ప్రజలకు జాగ్రత్తలు!

​వాయుగుండం తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఒడిశాలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

​ప్రజలకు ముఖ్య సూచనలు

​లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

​తెగిపడిన విద్యుత్ తీగలు, వరద ప్రవాహాలు, నీరు నిలిచిన రోడ్ల వద్దకు వెళ్లరాదు.

​అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిది.
🏠 Home