రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను బలోపేతం చేసి ప్రజలకు ఆధునిక, పారదర్శక సేవలు అందించేందుకు వీలుగా రూ.360 కోట్లతో తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో అద్దె, శిథిలావస్థ భవనాల్లో నడుస్తున్న 107 తహసీల్దార్, 10 ఆర్డీవో కార్యాలయాల కోసం రూ.263 కోట్లు, అలాగే 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సహా ఇతర రిజిస్ట్రేషన్ ఆఫీసుల కోసం రూ.97 కోట్లు మంజూరు చేసి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒకే నమూనా (మోడల్)లో ఈ ఆధునిక భవనాలను నిర్మిస్తామని, స్థలాల గుర్తింపు పూర్తి చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటు భాగస్వామ్యంతో 13 సమగ్ర కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నిర్మాణంతో పాటు ఐదేళ్ల నిర్వహణ బాధ్యతను కూడా ఆయా సంస్థలే చూసుకుంటాయని, ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి పొంగులేటి వివరించారు.