🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 July 2026, 01:46 PM Posted by: MANA VISHWAM

​పేద తల్లిదండ్రులపై బీసీ గురుకులాల సెక్రటరీ దురుసు ప్రవర్తన: కేయూ విద్యార్థి నాయకుడు ఒంటేరు చక్రి ధ్వజం

బీసీ గురుకులాల సెక్రటరీ పేద విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల అత్యంత దురుసుగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) విద్యార్థి నాయకుడు ఒంటేరు చక్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు చుట్టూ తిరుగుతున్న పేద ప్రజలకు అందుబాటులో ఉండని అధికారి, కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే సీట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

​వినతి పత్రం ఇస్తే 'చల్' అంటూ నిర్లక్ష్యం

​గురుకులాల్లో సీట్ల కోసం కార్యాలయానికి వచ్చిన పేద తల్లిదండ్రులను సెక్రటరీ తీవ్రంగా అవమానిస్తున్నారని చక్రి పేర్కొన్నారు. ఒక పేద తల్లి తన బిడ్డ సీటు కోసం "వినతి పత్రం ఇచ్చి చూడండి సార్" అని వేడుకుంటే, కనీసం పట్టించుకోకుండా "చల్" అంటూ దురుసు పదజాలంతో తోసిపుచ్చి వెళ్ళిపోయారని మండిపడ్డారు. "ఎవరి సీట్లు ఎవరికి ఇయ్యాలి? అంతా మెరిట్ ప్రకారమే ఇస్తా.. పేద ప్రజలతో నాకు సంబంధం లేదు, ఎందుకు వచ్చినారు?" అంటూ ప్రజలపై పగవాడిలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

​లీడర్లకు సీట్లు.. పేదలకు పోట్లాటలా?

​సాధారణ ప్రజలు అడిగితే మెరిట్ సూత్రాలు మాట్లాడే సెక్రటరీ, పర్సనల్ గా కలిసే రాజకీయ నాయకులకు మాత్రం వెనకాముందూ చూడకుండా సంతకాలు పెట్టి సీట్లు రాసిస్తున్నారని ఒంటేరు చక్రి ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే తీవ్రంగా సీరియస్ అవుతూ, ప్రజలకు అందుబాటులో లేకుండా దాగుడుమూతలు ఆడుతున్నారని విమర్శించారు.

​ "పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, తల్లిదండ్రులను అవమానిస్తున్న ఇటువంటి దురుసు అధికారిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. తక్షణమే ఆయన్ను ఆ బాధ్యతల నుంచి మార్చాలి."
— ఒంటేరు చక్రి, కేయూ విద్యార్థి నాయకుడు

​ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
🏠 Home