ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్డు పనుల కొలతలను ఎం-బుక్లో నమోదు చేసి, పైఅధికారులకు పంపేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన చొప్పదండి పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు నిఘా ఉంచి, లంచం తీసుకుంటుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆ నగదును తన ద్విచక్ర వాహనం సీటు కింద దాచగా అధికారులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపిన అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు.