🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 02 August 2026, 03:11 PM Posted by: MANA VISHWAM

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహంకాళికి బోనం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు

మంత్రులతో కలిసి పట్టువస్త్రాల సమర్పణ..

లష్కర్ బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

హైదరాబాద్, ఆగస్టు 2 (మన విశ్వం): సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం సమర్పించి పట్టువస్త్రాలు అర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ (సీతక్క) కూడా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
లష్కర్ బోనాల జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సంప్రదాయ కళారూపాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
🏠 Home