🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 02 August 2026, 11:18 PM Posted by: MANA VISHWAM

బాక్సింగ్‌లో భారత్ స్వర్ణ పంచ్..!

కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 7 బంగారు పతకాలు..

మొత్తం 10 పతకాలతో భారత బాక్సర్ల చరిత్రాత్మక ప్రదర్శన

స్కాట్లాండ్గ్ లోని గాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత బాక్సర్లు అద్భుత విజయాలతో సత్తా చాటారు. ఫైనల్‌కు చేరిన పది మంది భారత బాక్సర్లలో ఏడుగురు స్వర్ణ పతకాలు, ముగ్గురు రజత పతకాలు సాధించి దేశానికి అరుదైన విజయాన్ని అందించారు. ఈ ఘన ప్రదర్శనతో బాక్సింగ్ విభాగంలో భారత్ అగ్రస్థానంలో నిలవగా, అంతర్జాతీయ వేదికపై భారత పటిమ మరోసారి చాటుకుంది.
మహిళల విభాగంలో ప్రీతి పవార్ (54 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), జైస్మిన్ లాంబోరియా (57 కేజీలు), ప్రియ ఘంగాస్ (60 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) తమ తమ ఫైనల్స్‌లో ప్రత్యర్థులను ఓడించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుష్ పంగాల్ (80 కేజీలు) కూడా అద్భుత పోరాటంతో బంగారు పతకాలను భారత్ ఖాతాలో జమ చేశారు.
ఫైనల్‌కు అర్హత సాధించిన మిగిలిన ముగ్గురు భారత బాక్సర్లు రజత పతకాలతో సరిపెట్టుకున్నప్పటికీ, మొత్తం పది మంది పతకాలతో తిరిగి రావడం భారత బాక్సింగ్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.
బాక్సింగ్‌తో పాటు అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, జూడో విభాగాల్లోనూ భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగించారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 39కు చేరింది. ఈ ప్రదర్శనతో ఓవరాల్ పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతూ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.
🏠 Home