🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 04 August 2026, 09:19 PM Posted by: MANA VISHWAM

రాజకీయాల్లోకి రాను.. ఉద్యోగమే నా బాధ్యత: ఏవీ రంగనాథ్

జనసేనలో చేరతానన్న ప్రచారానికి చెక్ పవన్ కల్యాణ్ భూమి

వివాదంపై సాంకేతిక వివరణ 'నిబంధనలు అందరికీ ఒకటే' అని స్పష్టీకరణ

తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, అధికారిగా తన బాధ్యతలను ప్రశాంతంగా నిర్వర్తించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రంగనాథ్.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో రెండు దశాబ్దాలుగా పరిచయం ఉందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కూడా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అయితే వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. తెలంగాణలో జనసేన బాధ్యతలు చేపడతానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు.

పవన్ భూమి వివాదంపై వివరణ

గండిపేట సమీపంలోని జన్వాడలో పవన్ కల్యాణ్‌కు చెందిన భూమిపై నెలకొన్న వివాదంపై కూడా రంగనాథ్ స్పందించారు. 2014లో నలుగురు రైతుల నుంచి సుమారు పది ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసిన తర్వాత చెరువుకు సంబంధించిన ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు వెలువడ్డాయని తెలిపారు. భూమి సహజ స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయలేదని, చెరువును పూడ్చడం లేదా నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టలేదని చెప్పారు.
అయితే చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ మాత్రం నిబంధనలకు విరుద్ధమని, అందుకే దానిని తొలగించాలని సూచించినట్లు వెల్లడించారు. చెరువుల పరిధిలోని పట్టా భూములను కొనుగోలు చేయడం, విక్రయించడం చట్టబద్ధమేనని, అయితే సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైడ్రా చర్యల్లో వ్యక్తులు కాదు, నిబంధనలే ప్రామాణికమని, ప్రతి కేసులో ఒకే విధమైన ప్రమాణాలతో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.


హైకోర్టు ఆదేశాల మధ్య ప్రకటన

ఇటీవల హైడ్రా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న రాజకీయ ప్రచారానికి రంగనాథ్ మరోసారి తెరదించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని, ప్రజా సేవలో భాగంగా అధికారిగా తన బాధ్యతలను కొనసాగించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
🏠 Home