🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 August 2026, 10:16 PM Posted by: MANA VISHWAM

టెక్స్‌టైల్ పార్కులో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

గణేష్ ఎకోటెక్ పరిశ్రమలో తెల్లవారుజామున ఘటన

లిఫ్ట్‌లో చిక్కుకుని పొగతో ఊపిరాడక కార్మికుల మృతి

40 మందిని సురక్షితంగా బయటకు తరలించిన సిబ్బంది

మృతుల కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లిస్తామన్న యాజమాన్యం


వరంగల్/గీసుగొండ , ఆగస్టు 13(మన విశ్వం) : గీసుకొండ మండలం శాయంపేట హవేలీ శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గణేష్ ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సుమారు ఒంటిగంట సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) జోనల్ మేనేజర్ వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పరిశ్రమ యాజమాన్యం అప్రమత్తమయ్యాయి. పరిశ్రమలో ఉన్న సుమారు 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.


లిఫ్ట్‌లో చిక్కుకుని..

ప్రమాద సమయంలో ఇద్దరు కార్మికులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. పొగ కారణంగా ఊపిరాడక వారు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతులను సూర్యప్రకాశ్‌ (34), ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వినోద్‌కుమార్ ప్రజాపతి (31)గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుల కుటుంబాలకు చట్టప్రకారం అందాల్సిన పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి, పరకాల ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
🏠 Home