🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 16 August 2026, 11:47 PM Posted by: MANA VISHWAM

తప్పుల పేపర్లు.. మళ్లీ యూజీసీ నెట్‌!

ఇంగ్లీష్‌, కామర్స్‌, సోషియాలజీకి రీఎగ్జామ్‌

ప్రశ్నపత్రాల్లో భారీగా తప్పులు.. కమిటీ

పరిశీలన తర్వాత ఎన్‌టీఏ నిర్ణయం

సెప్టెంబరు 9న ఇంగ్లీష్‌, కామర్స్‌.. 10న సోషియాలజీ

అదనపు ఫీజు లేకుండానే పరీక్ష

యూజీసీ నెట్‌ పరీక్షల్లో మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో పెద్దఎత్తున తప్పులు దొర్లడంతో వాటికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఇంగ్లీష్‌, కామర్స్‌, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబరు 9, 10 తేదీల్లో రీఎగ్జామ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నపత్రాల్లో తప్పులపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిని పరిశీలించిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది జూన్‌ 22 నుంచి 30 వరకు మొత్తం 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్‌ పరీక్షలు జరిగాయి. వీటిలో ఇంగ్లీష్‌, కామర్స్‌, సోషియాలజీ ప్రశ్నపత్రాలపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రశ్నల రూపకల్పనతో పాటు వ్యక్తులు, పుస్తకాల పేర్లు, అనువాదం, వ్యాకరణం, టైపింగ్‌కు సంబంధించిన అనేక తప్పులు ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు. గతంలో అడిగిన కొన్ని ప్రశ్నలు సైతం పునరావృతమైనట్లు తేలింది.


కొన్ని ప్రశ్నలు తొలగిస్తే సరిపోదు

అభ్యంతరాలు వచ్చిన కొన్ని ప్రశ్నలను మాత్రమే తొలగించి ఫలితాలు ప్రకటించడం వల్ల అభ్యర్థులకు న్యాయం జరగదని కమిటీ అభిప్రాయపడింది. తప్పుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయా సబ్జెక్టులకు పూర్తిస్థాయిలో మళ్లీ పరీక్ష నిర్వహించడమే సరైన మార్గమని సూచించింది. దీంతో మూడు సబ్జెక్టులకు రీఎగ్జామ్‌ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.


పరీక్షల షెడ్యూల్‌ ఇదీ..

సెప్టెంబరు 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబరు 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోషియాలాజీ పరీక్ష జరుగుతుంది.
పరీక్ష కేంద్రాలు, అడ్మిట్‌ కార్డులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. రీఎగ్జామ్‌ రాసే అభ్యర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది.
మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాల విడుదలపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని స్పష్టం చేసింది. వాటి ఫలితాలను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే వెల్లడించనున్నట్లు పేర్కొంది. జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియకూ మూడు సబ్జెక్టుల రీఎగ్జామ్‌తో ఆలస్యం ఉండదని తెలిపింది.
🏠 Home