🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 17 August 2026, 11:00 PM Posted by: MANA VISHWAM

తప్పు ఎన్‌టీఏది.. శిక్ష విద్యార్థులకా?

యూజీసీ-నెట్‌ పునఃపరీక్షలపై రాహుల్‌గాంధీ ఆగ్రహం

ప్రశ్నపత్రాల్లో తప్పులకు విద్యార్థులను బాధ్యులను చేస్తారా?

ఎన్‌టీఏను జవాబుదారీ చేయాలని కేంద్రానికి డిమాండ్‌

యూజీసీ -నెట్‌లో మూడు సబ్జెక్టులకు పునఃపరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు." తప్పులు చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ )... శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవించాలా? " అని ప్రశ్నించారు.
సోషియాలజీ, ఇంగ్లీష్‌, కామర్స్‌ సబ్జెక్టులకు జూన్‌ 22 నుంచి 30 మధ్య యూజీసీ-నెట్‌ పరీక్షలు నిర్వహించారని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల్లో తప్పులు వెలుగుచూడటంతో ఆయా పరీక్షలను రద్దు చేసి సెప్టెంబరులో మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఈ మేరకు సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన రాహుల్‌గాంధీ.. "మోదీజీ.. తప్పు ఎన్ టీ ఏ చేస్తే విద్యార్థులు ఎందుకు శిక్ష అనుభవించాలి?" అని నిలదీశారు. పరీక్షల నిర్వహణలో లోపాలకు కారణమైన వ్యవస్థను జవాబుదారీ చేయకుండా, విద్యార్థులను మరోసారి పరీక్షలకు హాజరయ్యేలా చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పరీక్షల కోసం నెలల తరబడి సిద్ధమైన అభ్యర్థులు ఎన్‌టీఏ తప్పిదాల కారణంగా మళ్లీ మానసిక ఒత్తిడి, సమయం, వ్యయాన్ని భరించాల్సి వస్తోందని ఆయన ఆక్షేపించారు.

తప్పిదాలకు భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
🏠 Home