🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 18 August 2026, 09:13 AM Posted by: MANA VISHWAM

నర్సంపేటలో రాజకీయ వేడి.. కాంగ్రెస్‌లో ఉత్సాహం.. బీఆర్‌ఎస్‌లో ఆగ్రహం

నర్సంపేట, ఆగస్టు 18 (మన విశ్వం): ఓ వైపు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమవుతుండగా.. మరోవైపు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఒక పార్టీలో సంబరాల సందడి.. మరో పార్టీలో నిరసనల వేడి నెలకొనడంతో నర్సంపేట నియోజకవర్గంలో మంగళవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మంగళవారం వేకువజామున తొలగించినట్లు సమాచారం. మెడికల్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పోలీసు పహారా మధ్య అత్యంత గోప్యంగా అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తోంది. విగ్రహం కోసం నిర్మించిన గద్దెను పూర్తిగా కూల్చివేసి, సిమెంట్‌ ఇటుకలు, శిథిలాలను సైతం అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.


అర్ధరాత్రి నుంచే కదలికలు!

విగ్రహం తొలగింపునకు అర్ధరాత్రి నుంచే కదలికలు మొదలైనట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జేసీబీ సాయంతో విగ్రహం ఉన్న ప్రదేశంలో పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఫోన్లు వినియోగించకుండా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది.


గద్దె కూల్చివేతతో మొదలైన వివాదం

పెద్ది సుదర్శన్‌రెడ్డి జులై 31న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన దశదినకర్మ సందర్భంగా మెడికల్‌ కళాశాల సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్ణయించాయి. కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం గద్దె నిర్మించారు. ఆ భూమి అసైన్డ్‌ భూమి అనే చర్చ కూడా అప్పట్లో సాగింది.
మున్సిపల్‌ అనుమతులు లేవంటూ అధికారులు తొలుత గద్దెను కూల్చివేశారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు అంబేడ్కర్‌ సెంటర్‌లో ధర్నాకు దిగాయి. అదే రోజు సాయంత్రం అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.


వారం తర్వాత.. వేకువజామున తొలగింపు

విగ్రహాన్ని మరుసటి రోజే తొలగిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అప్పటి నుంచి మెడికల్‌ కళాశాల పరిసరాల్లో వారం రోజులుగా పోలీసులు షిఫ్టుల వారీగా పహారా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తొలగింపు ప్రక్రియ ఆలస్యమైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. చివరకు మంగళవారం వేకువజామున విగ్రహాన్ని తొలగించినట్లు సమాచారం.


ముందస్తు అరెస్టులు.. పోలీసు బందోబస్తు

విగ్రహం తొలగింపుతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో పోలీసు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


ఇటు పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు

ఇదే సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఓ వైపు ఎమ్మెల్యే పుట్టినరోజు సంబరాలు.. మరో వైపు దివంగత మాజీ ఎమ్మెల్యే విగ్రహం తొలగింపు పై ఆగ్రహం నెలకొనడం నర్సంపేట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
🏠 Home