🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 18 August 2026, 09:10 PM Posted by: MANA VISHWAM

విగ్రహం తొలగింపు పాశవిక చర్య: కేటీఆర్‌

తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో రాత్రికి రాత్రే తొలగించడం పాశవిక చర్య అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించేలా వ్యవహరించడం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
విగ్రహం తొలగింపును నిరసిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్‌ ఖండించారు. శాసనమండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు పలువురు నేతలను నిర్బంధించడం ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడమేనన్నారు. అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే దుఃఖంలో ఉన్న పెద్ది కుటుంబ సభ్యులను ఇలాంటి చర్యలతో మరింత బాధపెట్టొద్దన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు నర్సంపేట మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టడంతోపాటు ఆయన పోరాటానికి శాశ్వత గుర్తింపు కల్పిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.
🏠 Home