🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 18 August 2026, 09:26 PM Posted by: MANA VISHWAM

24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు

22ఏ పొరపాట్లను సరిదిద్దుతున్నాం: పొంగులేటి

15 రోజులపాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన

ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 18 (మన విశ్వం): 22ఏ నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన ప్రైవేటు ఆస్తుల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమస్యను గుర్తించిన 24 గంటల్లోనే మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 కలిపి 34 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే క్రమంలో కొన్ని ప్రైవేటు ఆస్తులు సాంకేతిక పొరపాట్లతో 22ఏ జాబితాలో చేరాయని చెప్పారు. ‘‘పొరపాటును పారదర్శకంగా అంగీకరించాం. దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా మాదే. సామాన్యుల న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళానికీ అన్యాయం జరగనివ్వం’’ అని స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, 15రోజులపాటు రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి నిజమైన ప్రైవేట్ ఆస్తులను క్లియర్ చేస్తామని తెలిపారు. 22ఏ అంశాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని విపక్షాలకు సూచించారు. ‘‘మేం తప్పును ఒప్పుకొని దిద్దుతున్నాం.. మీరు చేసిన తప్పులను ఒప్పుకొనే ధైర్యం ఉందా?’’ అని ప్రశ్నించారు.
🏠 Home