🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 19 August 2026, 02:06 PM Posted by: MANA VISHWAM

నూనె మిల్లులో ఘోరం.. పళ్లచక్రాల్లో మహిళ చేయి!

నూనె పట్టించుకునేందుకు వెళ్లి ప్రమాదం

సిబ్బంది అప్రమత్తతతో నిలిచిన యంత్రం.. ఆసుపత్రికి తరలింపు

నల్లబెల్లి, (మన విశ్వం): గృహ అవసరాల కోసం నూనె పట్టించుకునేందుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. నూనె గింజలను యంత్రంలో వేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి పళ్లచక్రాల మధ్య చిక్కుకోవడంతో తీవ్రంగా నలిగి ఎముకలు విరిగిన ఘటన నల్లబెల్లి మండల కేంద్రంలోని ఓ నూనె మిల్లులో చోటుచేసుకుంది.
రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత స్థానిక మహిళా బ్యాంకులో సీఏగా పనిచేస్తున్నారు. గృహ అవసరాల నిమిత్తం నూనె పట్టించుకునేందుకు నల్లబెల్లిలోని ఓ మిల్లుకు వెళ్లారు. గింజలను యంత్రంలో వేస్తున్న సమయంలో ఆమె చేయి ఒక్కసారిగా పళ్లచక్రాల మధ్య చిక్కుకుంది. యంత్రం తిరుగుతుండటంతో చేయి తీవ్రంగా నలిగి ఎముకలు విరిగినట్లు తెలిసింది.
కవిత కేకలు వేయడంతో మిల్లు సిబ్బంది, స్థానికులు వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. యంత్ర భాగాలను సడలించి ఎంతో శ్రమించి ఆమె చేయిని బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home