🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 19 August 2026, 05:53 PM Posted by: MANA VISHWAM

ముత్తజిపేటలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన కారు

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలు

గంధంపల్లి నుంచి మేడారం వెళ్తుండగా దుర్ఘటన

నర్సంపేట, ఆగస్టు 19 (మన విశ్వం): మేడారం వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచింది. వరంగల్ జిల్లా ముత్తజిపేట గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా గంధంపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు కారులో మేడారం వైపు బయలుదేరారు. ముత్తజిపేట సమీపానికి చేరుకోగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఓ ఇంటిని ఢీకొని బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా అందులోని ఆరుగురిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కారు అదుపుతప్పడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home