🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 20 August 2026, 08:52 AM Posted by: MANA VISHWAM

పొంగులేటిని తక్షణమే తప్పించండి.. రాహుల్ గాంధీకి హరీష్ లేఖ

‘తెలంగాణలో తీవ్ర పాలనా సంక్షోభం’

‘30% వసూళ్ల దందా.. 50:50 ఒప్పందాలకు ఒత్తిళ్లు’ అంటూ ఆరోపణ

రెవెన్యూ మంత్రి పొంగులేటిని తక్షణమే తొలగించాలని డిమాండ్

రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి

2023 డిసెంబరు నుంచి 22ఏ చేర్పులు, తొలగింపులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు పట్టు

హైదరాబాద్‌: తెలంగాణలో సెక్షన్‌ 22ఏ వ్యవహారంపై బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకునేందుకు ఉద్దేశించిన చట్టపరమైన నిబంధనను ప్రైవేటు ఆస్తులను నిలిపివేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ‘30 శాతం వసూళ్ల దందా’ సాగుతోందని, కొన్ని ఆస్తుల విషయంలో ముందుగా ఏర్పాటు చేసిన లేదా బినామీ సంస్థలతో 50:50 డెవలప్‌మెంట్‌ ఒప్పందాలకు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు.


వేలాది ఆస్తులకు చిక్కులు

హైదరాబాద్‌, మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఆస్తులు 22ఏ సమస్యతో ప్రభావితమయ్యాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులు పొందిన లేఅవుట్లు, దశాబ్దాలుగా పట్టా హక్కులు ఉన్న భూములు సైతం ఇందులో ఉన్నట్లు తెలిపారు. భూ రికార్డుల్లో స్పష్టత తీసుకొస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ‘భూ భారతి’.. స్థిరపడిన ఆస్తి హక్కులకే అనిశ్చితి కలిగించేలా మారకూడదని పేర్కొన్నారు.


‘పొంగులేటిని తొలగించాలి’

22ఏ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. 2023 డిసెంబరు నుంచి సెక్షన్‌ 22ఏ జాబితాలో జరిగిన చేర్పులు, తొలగింపులన్నింటిపైనా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించడంతో పాటు అవినీతి ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు.
చట్టబద్ధమైన ఆస్తి యజమానుల హక్కులకు రక్షణ కల్పించాలని, 22ఏ పరిధిలోని వివరాలను జిల్లా, సర్వే నంబర్ల వారీగా బహిరంగపరచాలని కోరారు." సెక్షన్ 22ఏ చట్టపరమైన రక్షణ కవచం. దాన్ని దోపిడీకి, బెదిరింపు వసూళ్లకు ఉపయోగించే ఆయుధంగా మార్చకూడదు" అని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.
🏠 Home