🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 20 August 2026, 01:38 PM Posted by: MANA VISHWAM

రబ్బరు చెప్పుల నుంచి కోట్లకు.. ఎలా హరీశ్‌?

‘‘పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నవారే ఇప్పుడు అవినీతి, కమిషన్ల గురించి నీతులు చెబుతున్నారా?’’ అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాల్సింది పోయి.. అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించడమే బీఆర్ఎస్‌ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.


‘హరీశ్‌ నోట అవినీతి మాటలా?’

కమిషన్లు, అవినీతి అంటూ హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పొంగులేటి ఎద్దేవా చేశారు. ‘‘హరీశ్‌రావు అవినీతి గురించి మాట్లాడుతుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లుంది. ఆయన నీతి వాక్యాలు వింటే సొంత పార్టీ నేతలే నవ్వుకునే పరిస్థితి’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో జరిగిన వ్యవహారాలపై ఆ పార్టీ నేత కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని సూచించారు.


‘రబ్బరు చెప్పుల నుంచి కోట్ల సంపదకు ఎలా?’


హరీశ్‌రావు ఆస్తులపైనా పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకప్పుడు రబ్బరు చెప్పులతో తిరిగిన ‘అగ్గిపెట్టె రావు’.. పదేళ్లలో తరతరాలు తిన్నా తరగని సంపద ఎలా సంపాదించారు? ఏ వ్యాపారం చేశారు? అంత తక్కువ సమయంలో అంతటి ఆర్థిక పరిపుష్టి ఎలా సాధ్యమైంది? ఆ రహస్యాన్ని ప్రజలకు చెప్పాలి’’ అంటూ ప్రశ్నలు సంధించారు.


‘కాళేశ్వరం నుంచి ధరణి వరకు..’

కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్‌ కాలేజీల వరకు గత బీఆర్ఎస్‌ పాలనలో అవినీతి జరిగిందని పొంగులేటి ఆరోపించారు. తమ హయాంలో కమిషన్లతో పనులు జరిగాయి కాబట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ అలాగే జరుగుతుందని బీఆర్ఎస్‌ నేతలు భావించడం భ్రమేనన్నారు. ఆధారంలేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు.


‘ప్రతిపక్షంగానూ పనికిరారా?’

‘‘అధికారంలో ఉన్నప్పుడు పాలనలో పూర్తిగా విఫలమయ్యారు. అధికారం కోల్పోయాకైనా ప్రజల పక్షాన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తారనుకుంటే అదీ లేదు. అబద్ధాలు, ఆరోపణలతో కాలం గడుపుతూ ప్రతిపక్ష పార్టీగానూ బీఆర్ఎస్‌ పనికిరాదని నిరూపించుకుంటోంది’’ అని పొంగులేటి ధ్వజమెత్తారు.
🏠 Home