🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 20 August 2026, 02:16 PM Posted by: MANA VISHWAM

పెద్ది సేవలకు గుర్తుగా కాంస్య విగ్రహం

బీఆర్‌ఎస్‌ ముందుకు రాకపోతే ప్రజల సహకారంతో మేమే ఏర్పాటు చేస్తాం

అన్ని అనుమతులతో గౌరవప్రదంగా ప్రతిష్ఠిస్తాం
పీసీసీ సభ్యుడు రామానంద్‌ వెల్లడి

నర్సంపేట(మన విశ్వం) : తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలకు గుర్తింపుగా నర్సంపేటలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పీసీసీ సభ్యుడు రామానంద్‌ తెలిపారు. విగ్రహం విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా, ఆయన చేసిన ప్రజాసేవకు తగిన గౌరవం కల్పించాలని కోరారు. అవసరమైన అనుమతులు తీసుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ముందుకు రాకపోతే కాంగ్రెస్‌ కార్యకర్తలే ప్రజల సహకారంతో నిధులు సమీకరించి ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన పోరాటాలను ప్రజలు మరిచిపోలేదని రామానంద్‌ పేర్కొన్నారు. ఆయన విగ్రహం అంశాన్ని రాజకీయ విమర్శలు, ఆరోపణలకు వేదికగా మార్చడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ అన్ని అనుమతులతో గౌరవప్రదంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు రావాలని సూచించారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల సహకారంతో విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపడతారని తెలిపారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి స్మృతిని చిరస్థాయిగా నిలిపేలా కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని రామానంద్‌ వెల్లడించారు.
🏠 Home