🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 27 August 2026, 06:40 PM Posted by: MANA VISHWAM

నగదు బ్యాగు కోసి రూ.1.50 లక్షలతో పరారీ

అమ్మకాల ద్వారా వసూలైన నగదుపై కన్నేసిన ఓ హెల్పర్‌.. అదను చూసి బ్యాగును కోసి రూ.1.50 లక్షలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు యాద గణేష్‌ (25)ను గీసుగొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.20 వేల నగదు, శామ్‌సంగ్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ డి.విశ్వేశ్వర్‌ వెల్లడించారు.
గొర్రెకుంటకు చెందిన తాంటికంటి భాస్కర్‌ ఓ కంపెనీలో నాలుగేళ్లుగా సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 21న డ్రైవర్‌ కుళ్ల సునీల్‌, హెల్పర్‌ యాద గణేష్‌తో కలిసి డీసీఎం వాహనంలో స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల విక్రయానికి విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు వెళ్లారు. అమ్మకాలు పూర్తిచేసుకుని వసూలైన నగదుతో తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ నెల 23న సాయంత్రం 5 గంటల సమయంలో జాన్‌పాక్‌ వద్ద ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ పోయించేందుకు వాహనాన్ని నిలిపారు. నగదు ఉన్న బ్యాగుకు తాళం వేసి సీటు వెనుక ఉంచిన భాస్కర్‌.. బిల్లు తీసుకునేందుకు కిందకు దిగారు. ఆ సమయంలో హెల్పర్‌ గణేష్‌ క్యాబిన్‌లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భాస్కర్‌ తిరిగి వచ్చేసరికి గణేష్‌ కనిపించలేదు. అనుమానం వచ్చి నగదు బ్యాగును పరిశీలించగా కింది భాగం కోసి ఉంది. అందులోని రూ.1.50 లక్షలు మాయమైనట్లు గుర్తించి గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గణేష్‌ను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి గతంలోనూ ఓ దొంగతనం కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్‌ వెల్లడించారు.
🏠 Home