🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 30 August 2026, 11:18 PM Posted by: MANA VISHWAM

అప్పుడు మౌనం.. ఇప్పుడు నీతులా?

హైదరాబాద్‌, ఆగస్టు 30 (మన విశ్వం): మహిళలు, మైనర్ బాలికలపై అకృత్యాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలన్నదే బీఆర్‌ఎస్‌ స్పష్టమైన వైఖరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ వ్యవహారంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించిన తీరును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కోరడంతోపాటు పార్టీ నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు చట్టసభల్లో కొనసాగడం సమర్థనీయం కాదన్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ప్రవీణ్‌కుమార్‌ తప్పుబట్టారు. గతంలో బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో మైనర్ బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నాయకత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించిన సమయంలో బీఆర్‌ఎస్‌ మాత్రమే బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా నిలిచి పోరాడిందని ఆయన పేర్కొన్నారు.
‘‘బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించే ముందు బండి సంజయ్‌తోపాటు బీజేపీ నేతలపై గతంలో వచ్చిన ఆరోపణల విషయంలో మీ పార్టీ వైఖరి ఏమిటో రామచంద్రరావు స్పష్టం చేయాలి. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తే బాగుంటుంది’’ అని ప్రవీణ్‌కుమార్‌ హితవు పలికారు.
🏠 Home