🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 02 September 2026, 10:19 AM Posted by: MANA VISHWAM

మూడు దశాబ్దాలైనా.. చెదరని స్నేహం!

మూడు దశాబ్దాలు గడిచాయి.. జీవితాలు మారాయి.. ఉద్యోగాలు, వ్యాపకాలతో ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో స్థిరపడ్డారు. కానీ కళాశాల రోజుల్లో మొదలైన స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదు. వరంగల్‌లోని సీకేఎం డిగ్రీ కళాశాలలో 1996లో బీఎస్సీ (మ్యాథ్స్‌) కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత హనుమకొండలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న మిత్రులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కళాశాల రోజుల నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తరగతి గదిలో జరిగిన సరదా సంఘటనలు, అప్పటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు. ఒకరి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విశేషాలను మరొకరు తెలుసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.


స్నేహం కోసం యూకే నుంచి..

ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థి సాంబమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడు దశాబ్దాల నాటి మిత్రులను కలుసుకోవాలనే తపనతో ఆయన యూకే నుంచి ప్రత్యేకంగా హనుమకొండకు వచ్చారు. సాంబమూర్తిని చూసిన మిత్రులు ఆనందంతో ఆప్యాయంగా స్వాగతించారు. దూరాలు పెరిగినా స్నేహానికి అవి అడ్డుకావని ఆయన రాక చాటిచెప్పింది.
పాత మిత్రులంతా కలిసి ఫొటోలు దిగుతూ తమ కలయికను జ్ఞాపకంగా పదిలం చేసుకున్నారు.' కాలం మారొచ్చు.. దూరాలు పెరగొచ్చు.. కానీ నిజమైన స్నేహం చెరిగిపోదు ' అనే భావనకు ఈ సమ్మేళనం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంజయ్‌, సమ్మయ్య, స్వామి, నారాయణరెడ్డి, సాంబమూర్తి, వెంకట్‌, శ్రీనివాస్‌, చంద్రయ్య, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home