🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 02 September 2026, 03:41 PM Posted by: MANA VISHWAM

నాపై చర్యలా?.. ముందు సీఎంపై తీసుకోండి!

హస్తినలో కొండా సురేఖ సంచలన ఎదురుదాడి

‘పదేళ్లు తానే సీఎం అని ఎలా చెప్పుకుంటారు?’

‘మంత్రులు, నేతల్లోనూ అసంతృప్తి.. పలువురు మంత్రులపై ఆరోపణలకు సమాధానమేంటి?’

‘బీసీకి ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?’

‘రాజీనామా చేయమని ఎవరూ చెప్పలేదు.. అధిష్ఠానానికి అన్నీ రాతపూర్వకంగా ఇచ్చా’

పొలిటికల్ బ్యూరో , సెప్టెంబర్‌ 2 (మన విశ్వం): తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కొండా’ కలకలం కీలక మలుపు తిరిగింది. తనపై క్రమశిక్షణ చర్యల ప్రచారం సాగుతున్న వేళ మంత్రి కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై చర్యలు తీసుకునేముందు సీఎం పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని ఎలా చెప్పుకుంటారు? అంటూ ప్రశ్నించారు. మంత్రులు, పార్టీ నేతల్లోనూ అసంతృప్తి ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరతీశాయి.
తన విషయంలోనే క్రమశిక్షణను ఎందుకు ముందుకు తెస్తున్నారని సురేఖ ప్రశ్నించినట్లు తెలిసింది. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి పార్టీ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలని ప్రశ్నించారు. అందరికీ ఒకే కొలమానం ఉండాలన్నది ఆమె వాదనగా కనిపిస్తోంది. బీసీ కి ఒక న్యాయం.. ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా?
అంటూ సామాజిక న్యాయం అంశాన్నీ సురేఖ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఆమెపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయం రాజకీయంగానే కాకుండా సామాజిక సమీకరణాల పరంగానూ కీలకంగా మారే పరిస్థితి నెలకొంది.
తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదని సురేఖ స్పష్టం చేశారు. జరిగిన పరిణామాలు, తన వాదనతోపాటు తాను లేవనెత్తుతున్న అంశాలన్నింటినీ అధిష్టానానికి రాతపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు.
సురేఖ తాజా వ్యాఖ్యలతో ఇప్పటివరకు ఆమె పై చర్య ఉంటుందా,? అన్న దిశలో సాగిన వ్యవహారం ఒక్కసారిగా సీఎం సంగతేంటి?.. ఇతర మంత్రులపై ఆరోపణల సంగతేంటి? అన్న దిశకు మళ్లింది. దీంతో బంతి ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానం కోర్టులో పడింది. సురేఖపై చర్య తీసుకుంటే ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి.. చర్య తీసుకోకపోతే పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వివరణ ఇచ్చేందుకు హస్తినకు వెళ్లిన సురేఖ.. చివరకు అధిష్టానం ముందే ప్రశ్నల చిట్టా పెట్టడంతో ' కొండా ' వ్యవహారం ఇప్పుడు ఆమె మంత్రి పదవి ఒక్కదానికే పరిమితం కాకుండా తెలంగాణ కాంగ్రెస్ లోని అంతర్గత అసంతృప్తి, నాయకత్వ సమీకరణాల వైపు మళ్ళింది
🏠 Home