గుండెపోటుతో ఏఆర్‌ఎస్‌ఐ మృతి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో ఏఆర్‌ ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.శామ్యూల్ (57) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేట జంక్షన్ సమీపంలోని తన నివాసం నుంచి విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శామ్యూల్ 1989లో పోలీసుశాఖలో చేరి సుమారు 37 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.