Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘30 ఏళ్లుగా వివాదం లేని ఇళ్లను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారు?’

Author MANA VISHWAM | 22 Aug 2026, 09:15 PM | హైదరాబాద్
‘30 ఏళ్లుగా వివాదం లేని ఇళ్లను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారు?’

నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములు, ఇళ్లపై ఆంక్షలు విధించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. బోడుప్పల్‌ పరిధిలోని తిరుమల మెడోస్‌, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్‌కు చెందిన వందలాది మంది 22ఏ బాధితులు తమ సమస్యలను వివరించారని తెలిపారు. వారి ఆవేదన కలచివేసిందన్నారు.
సర్వే నంబర్లు 215, 215 పార్ట్‌లలో సుమారు 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా దాదాపు 1,500 కుటుంబాలు నివసిస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాంటి ఆస్తులను అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ కింద 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు. అవసరాల కోసం ఇల్లు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తెలిసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ‘30% కమిషన్‌ సర్కార్‌’గా మారిందని విమర్శించారు. 22ఏ పేరుతో భయపెట్టి బినామీల ద్వారా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
బోడుప్పల్‌ బాధితులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అధైర్యపడొద్దని హరీశ్‌రావు పేర్కొన్నారు. వారి ఆస్తుల పరిరక్షణకు బీఆర్ఎస్‌ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తక్షణమే సంబంధిత కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే బాధితుల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.