Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: హరీశ్‌రావు

Author MANA VISHWAM | 23 Aug 2026, 01:23 PM | హైదరాబాద్
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: హరీశ్‌రావు

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి 18 నెలలుగా వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. వారి ఆవేదన చూస్తే గుండె కలిచివేస్తోందన్నారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబరు నుంచి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాలేదని, దాదాపు రూ.24 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నిధుల విడుదలలో జాప్యంతో ఆసుపత్రుల నిర్వహణ, మందులు, వైద్య పరికరాల కొనుగోలు, రోగుల సంరక్షణపై ప్రభావం పడుతోందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకూ నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవల కొనసాగింపు భారంగా మారుతోందని చెప్పారు.
‘‘ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. 18 నెలలుగా ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? జీతాలు లేక వారి కుటుంబాలు ఎలా గడవాలి? పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు ఎలా చెల్లించాలి?’’ అని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో బకాయిలు పేరుకుపోతున్నాయని విమర్శించారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన సుమారు రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య తేడా చూపకుండా సీనియారిటీ, ‘ఫస్ట్‌ కమ్‌–ఫస్ట్‌ సర్వ్‌’ ప్రాతిపదికన నిధులు విడుదల చేయాలన్నారు. పెండింగ్‌ వేతనాలను తక్షణమే చెల్లించి, పేదల ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని కాపాడాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.