Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

కీలక నిర్ణయాలతో రాష్ట్ర క్యాబినెట్..!

Author MANA VISHWAM | 02 Jul 2026, 10:57 PM | TELANGANA
కీలక నిర్ణయాలతో రాష్ట్ర క్యాబినెట్..!

వీబీజీ చట్టం అమలు.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం–భోజనం.. టిమ్స్

ఆస్పత్రులకు 6,278 పోస్టులు మూసీ అభివృద్ధి తొలి దశకు రూ.7,345 కోట్లకు ఆమోదం

హైదరాబాద్, జూలై 2 (మన విశ్వం): రాష్ట్ర మంత్రివర్గం గురువారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ఆమోదం తెలుపుతూనే, ఆ చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికీ అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు 6,278 పోస్టులు, మూసీ రివర్‌ఫ్రంట్ తొలి దశ అభివృద్ధి పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది.

వీబీజీ చట్టంపై న్యాయ పోరాటం

కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకుండా తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టంలోని నిబంధనలపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయవద్దని ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా జూలై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీకి ఆమోదం తెలిపింది. అదే సమయంలో చట్టంలోని నిబంధనలపై సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో పాటు పార్లమెంట్‌లోనూ కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది.

ఉపాధ్యాయులకు కూడా భోజన పథకం

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికీ అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది ఈ పథకం పరిధిలోకి రానున్నారు. దీనివల్ల పోషకాహారంతో పాటు నాణ్యత, జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

టిమ్స్ ఆస్పత్రులకు 6,278 పోస్టులు

సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు మొత్తం 6,278 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 1,494 రెగ్యులర్, 549 కాంట్రాక్ట్, 4,235 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఆస్పత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్‌వోసీలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మూసీ అభివృద్ధికి రూ.7,345 కోట్లు

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ తొలి దశ పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టులు సృష్టించడంతో పాటు అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకునేందుకు ఆమోదం తెలిపింది.

గిడ్డంగులు, విద్యాసంస్థలకు భూములు

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంటలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్‌లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల భూమిని జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని కూడా నిర్ణయించింది.