Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తెలంగాణ లో... సవాళ్ల రచ్చ!

Author MANA VISHWAM | 03 Jul 2026, 08:39 AM | TELANGANA
తెలంగాణ లో... సవాళ్ల రచ్చ!

చర్చకు రమ్మని కాంగ్రెస్‌ మంత్రులు పారిపోయారు: హరీశ్‌ రావు

కేటీఆర్, హరీష్‌ పిల్లలు.. దమ్ముంటే కేసీఆరే రావాలి: జూపల్లి సవాల్‌

​చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు విసరాలి?: కేటీఆర్‌ ఆగ్రహం

​ఎవడు పడితే వాడు అడిగితే సమాధానం చెప్పం: మంత్రి పొన్నం ఫైర్‌

​ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గురుకులాల టెండర్లలో అవినీతి, రాష్ట్ర అప్పులపై ఇరు పార్టీల నాయకులు విసిరిన సవాళ్లతో గన్‌పార్క్‌, తెలంగాణ భవన్‌ పరిసరాలు రణరంగంగా మారాయి. అరెస్టులు, తోపులాటలు, ఘాటు విమర్శలతో గురువారం రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

​ఫోన్‌ ఎత్తకుండా పారిపోయారు: హరీశ్‌ రావు

​గురుకులాల్లో రూ.2,000 కోట్ల అవినీతిపై చర్చకు రావాలంటూ మంత్రులు విసిరిన సవాల్‌ను స్వీకరించి గన్‌పార్క్‌కు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, బీఆర్‌ఎస్‌ బృందాన్ని తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో హరీశ్‌ రావు కిందపడిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ముగ్గురు మంత్రులకు ఫోన్‌ చేసినా ఒక్కరూ ఎత్తలేదు. చర్చకు రమ్మని కాంగ్రెస్‌ నేతలు తోకముడిచి పారిపోయారు. అవినీతి బయటపడుతుందనే భయంతోనే పోలీసులతో మమ్మల్ని అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు?" అని సూటిగా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

​కేటీఆర్, హరీష్ నాకు పిల్లలతో సమానం: మంత్రి జూపల్లి

​మరోవైపు, రాష్ట్ర అప్పులపై గన్‌పార్క్‌ సాక్షిగా మీడియా ముందే బీఆర్‌ఎస్‌కు ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ సవాల్‌ విసిరారు. "నేను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తా. కేటీఆర్, హరీష్ రావు నాకు పిల్లలతో సమానం. వాళ్లతో నాకేం చర్చ? దమ్ముంటే నేరుగా కేసీఆరే చర్చకు రావాలి" అని డిమాండ్‌ చేశారు.

కోన్ కిస్కా గొట్టం అడిగితే సమాధానం చెప్పాలా?


​గురుకులాల అవినీతి ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి, అజారుద్దీన్‌లు గన్‌పార్క్‌ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గురుకులాల మొత్తం టెండర్ల విలువ కూడా రూ.2,000 కోట్లు లేదు. 'కోన్ కిస్మా గొట్టం గాడు' అడిగితే మేము సమాధానం చెప్పం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒళ్ళు, నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అవినీతి జరిగినట్లు ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధం. నిరూపిస్తే ముగ్గురం మంత్రులం ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

​చేతకాని అసమర్థ సర్కార్‌పై పోరాడుతాం: కేటీఆర్‌

​మంత్రి జూపల్లి సవాల్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో తీవ్రంగా స్పందించారు. "తెలంగాణ భవన్‌కు వస్తానని ఫోజు కొట్టి జూపల్లి ఎందుకు పారిపోయారు? చేతగాని వాళ్లకు మాటలెక్కువ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మాకు సమయం ఇవ్వండి, కాంగ్రెస్‌ అవినీతిని నిరూపిస్తాం" అని సవాల్ చేశారు. సంక్షేమ శాఖలో రూ.2,000 కోట్ల కుంభకోణంపై ఆధారాలతో సహా నిరూపిస్తామంటే హరీశ్‌ రావు, ప్రవీణ్ కుమార్‌లను అక్రమంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. "అనుముల బ్రదర్స్ అదానీని మించి సంపాదిస్తున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఒక్క ఇల్లయినా కట్టిందా?" అంటూ ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్, కాంగ్రెస్ ​నాయకుల ఈ సవాళ్ల పర్వంతో హైదరాబాద్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.